కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణవాసుల దుర్మరణం!

  • తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
  • మద్యం మత్తులో బైక్ పై ప్రయాణం
  • అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిన వాహనం
మద్యం రక్కసి రెండు నిండు ప్రాణాలను బలిగొంది. పూటుగా మద్యం సేవించి బైక్ నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కాకినాడ సాగరతీరంలో నామపల్లి మల్లేశ్, వెంకటేశ్ బైక్ పై వెళుతున్నారు. ఇంతలో అదుపుతప్పిన వీరి వాహనం సమీపంలోని డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో మల్లేశ్, వెంకటేశ్ రోడ్డుపై అంతెత్తున ఎగిరిపడ్డారు.

వీరిని గమనించిన స్థానికులు అంబులెన్సు ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించగా,అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. వీరిద్దరూ మద్యం మత్తులో బైక్ పై వెళుతున్నారని తెలిపారు.

మద్యం మత్తులో బైక్ నడపడం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. మృతులు తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందినవారని పేర్కొన్నారు. ఈ ప్రమాదం విషయమై వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశామని చెప్పారు.
Go Back to Shorts
Andhra Pradesh
East Godavari District
Road Accident
Two Telangana people dead
Police

More Telugu News